ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

  • 2017లో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నియమావళి ఉల్లంఘన
  • బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • విచారణకు పదే పదే గైర్హాజరు కావడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ఏడుగురు విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 27 ఫిబ్రవరి 2017న ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తహసీల్దార్ డీవీ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతోపాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే గైర్హాజరు కావడంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

K. V. Ushashri Charan
Andhra Pradesh
YSRCP

More Telugu News